శ్రీలలిత త్రిపుర సుందరి అమ్మవారి ఆవిర్భావము 2

శ్రీలలిత త్రిపుర సుందరి అమ్మవారి ఆవిర్భావము 2



దేవతలు బ్రహ్మాండము బయటికి వెళ్ళి దాని కొరకు ఒక యజ్ఞము చేయాలని హిమాలయపర్వతముల మీద ఒక  యజ్ఞప్రాంగణము ఏర్పాటు చెయ్యాలనుకున్నారు. భండుడికి ఎందరో గూఢచారులు ఉన్నారు. వాడు ఎక్కడ ఎవరు ఎలా కదిలినా పసికడతాడు. ఏమి చెయ్యాలని ఆలోచన చేసారు. శ్రీమహావిష్ణువు – ‘భండుడికి ఇతరులు భోగములు అనుభవించకూడదు, తానే అనుభవించాలని కోరిక కనక ఇంతకముందు వాడు కనీ వినీ ఎరుగని ఇద్దరు కాంతలను సృష్టించి వాడి దగ్గరకు పంపి వాడు వారితో రతికేళిలో మునిగి తేలుతూ ఉండగా మనము నిశ్శబ్దముగా ఎవరికీ తెలియకుండా హోమగుండము ఏర్పాటు చేద్దామ’ ని దేవతలను వెంట పెట్టుకుని బ్రహ్మాండము అంచు దగ్గరకు తీసుని వెళ్ళారు. బ్రహ్మాండము బయటకు వెళ్ళి అవతల ఉన్నవారిని ఆహ్వానించాలి. దేవతలు బ్రహ్మాండమునకు ఒక రంధ్రము చేసి వెళితే బయట ఎన్నో కోట్లబ్రహ్మాండములు ఉన్నాయి. ఎవరిని పిలవాలి? ఎవరు వచ్చి రక్షిస్తారు? పిలిస్తే వచ్చి శక్తిపుట్టేట్టుగా అనుగ్రహించే రుద్రుడిని ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా పలుకుతాడని దేవతలు రుద్రుడిని ప్రార్థన చేసారు. దేవతలు చేసిన ప్రార్థన విని రుద్రుడు అక్కడకు వచ్చి మీకు కలిగిన ఆపద తీరాలి అంటే లలితాపరాభట్టారిక ఆవిర్భవించాలి. అందుకొరకు ఒక మహాయజ్ఞము చెయ్యాలి. శ్రీ మహావిష్ణువు భండుని మోహములో పడవెయ్యడానికి ఇప్పటికే ఇద్దరు కన్యలను సృష్టించారు. నిశ్శబ్దముగా హిమాలయ ప్రాంతమునకు వెళ్ళి హోమము చేద్దాము అన్నాడు.

పెద్ద యజ్ఞకుండము తయారు చేసారు. అందులో అగ్నిరగిల్చి హవిస్సులు వేసి అమ్మవారిని పిలవాలి. భండుడు తెచ్చిన ఉపద్రవమునకు అగ్నిహోత్రము ప్రతిష్ఠించడానికి ఈ బ్రహ్మాండములో ఉన్న అగ్నిపనికిరాదు. బ్రహ్మాండమునకు చేసిన రంధ్రమునుంచి చిదగ్ని అనే అగ్నిని వాయురూపములో తీసుకుని వచ్చి ఆ వాయువును అగ్నికుండములో పెట్టి హవిస్సులు ఇవ్వడానికి అగ్ని రగిలిస్తాను. సామాన్యమైన పదార్థములు వేస్తే యజ్ఞముతో ప్రీతి చెందడానికి చాలాకాలం పట్టవచ్చు. భండుడు మేల్కొనే లోపల అమ్మవారి ఆవిర్భావము జరిగిపోవాలి. మీ శరీరభాగములను ఖండించి హవిస్సుగా సమర్పించండి. దేవతలు కనక మీ శరీర భాగములను కోసినంత మాత్రమున మీకు మృత్యువు రాదు. ఆర్తి ప్రకటనము జరిగి అమ్మవారు ఆవిర్భవిస్తుంది అన్నాడు రుద్రుడు. ‘అమ్మా ! నువ్వు ఆవిర్భవించాలి’ అని దేవతలందరితో కలిసి రుద్రుడు ప్రార్థన చేసాడు.

దేవతలు తమ శరీరఖండములనుకోసి హోమకుండములో వేస్తూ అమ్మవారిని ప్రార్థన చేస్తుంటే కంటితో చూడడానికి వీలుకాని పరబ్రహ్మస్వరూపిణి, మణిద్వీపములో కూర్చుని అన్ని బ్రహ్మాండములను శాసించకలిగి, కోట్ల బ్రహ్మాండములకు నాయకురాలయిన అమ్మవారు అనుగ్రహము కలిగి, ఈ బ్రహ్మాండములో హిమాలయ పర్వతముల మీద ఏర్పాటు చేసిన హోమకుండములోని చిదగ్నినుంచి అమ్మవారి ఆవిర్భావము ప్రారంభము అయింది. అమ్మవారు ఆవిర్భవిస్తున్న స్వరూపమును దేవతలు ప్రార్థన చేసారు. ఆవిర్భవించిన తరవాత ఏమి జరిగిందన్నది లలితాసహస్రనామ పూర్వభాగములో వివరణ ఇచ్చారు. దేవతా సైన్యములను, వారాహిని, శ్యామలాదేవిని, బాలాదేనిని, ఏనుగులను, గుఱ్ఱములను, సృష్టి చేసి, తనభర్తను మహా కామేశ్వరుడిగా స్వీకరించి, ఎలా యుద్ధము చేసింది? భండుని ఎలా చంపింది ? అన్న విషయములు తరవాత భాగములో వస్తాయి. 

శ్రీలలిత త్రిపుర సుందరి అమ్మవారి ఆవిర్భావము 1

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...